అయితే, ఒకప్పుడు గోండి మంచి రోజులనే చూసింది.
“...గోండి అనేది ‘గోండ్వానా’ అనే ఒక పురాతన రాజ్యానికి అధికారిక భాషగా ఉండేది. దానికి సొంత లిపి, వ్యాకరణం, భాషాలంకారాలు, శబ్దవ్యుత్పత్తి శాస్త్రం, సాహిత్యం కూడా ఉన్నాయి. అవి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి,” గోండి సాహిత్య పండితుడైన మోతిరామ్ కంగాలీ తెలియజేసినట్లు భాషా పరిశోధన-ప్రచురణ కేంద్రం వెబ్సైట్లో ఉటంకించబడింది.
ఒకప్పుడు, గోండులు ప్రస్తుత మధ్యప్రదేశ్లోని విశాల భాగాలను పరిపాలించారు. “మేము గౌరాదేవి (హిందూ పురాణాలలో పార్వతి, దుర్గ అని కూడా పిలుస్తారు) వారసులం. అందుకే, మమ్మల్ని మేం గోండులుగా పిలుచుకుంటాం,” ఛింద్వాడాకు చెందిన గోండు సామాజిక కార్యకర్త రామ్నాథ్ పర్తేతి తెలియజేశారు. అయితే, సమకాలీన కాలంలో, తమ సముదాయపు చరిత్ర, అపూర్వమైన వారసత్వం లాంఛనప్రాయమైన కొన్ని ప్రకటనలకే పరిమితమయ్యిందని—ఉదాహరణకి, ఒక రైల్వే స్టేషన్కి గోండు మహారాణి రాణి కమలాపతి పేరు పెట్టడం లాంటివి—ఆయన వాపోయారు.
అలాగే, నెమ్మదిగా వాళ్ళ భాష కూడా కనుమరుగవుతోంది; అది ఎక్కువగా గోండుల ఇళ్ళకే పరిమితమయ్యింది. ఈ సముదాయపు ప్రజలు తమ ఇళ్ళకు వెలుపల, బహిరంగ ప్రదేశాలలో తరచూ హిందీలోనే మాట్లాడుతున్నారు. అయితే, వయోజన జనాభా మాత్రమే ప్రధానంగా ఇప్పటికీ గోండిలో సంభాషిస్తున్నారు; యువతరం ఈ భాషను నేర్చుకోవడానికి, లేదా మాట్లాడడానికి సంకోచిస్తోంది. గోండి తెలియనివాళ్ళు తమని తప్పుగా అర్థం చేసుకుంటారని, అంతకంటే ముఖ్యంగా, తమని ఎగతాళి చేస్తారనే భయమే ఇందుకు కారణమని చాలామంది అంటున్నారు.
ప్రార్థన తండ్రి మంతరామ్ పర్తేతి లోనాదేయీలో ఒక రైతు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే తన పిల్లలతో గోండిలో మాట్లాడతారు. అయితే, వాళ్ళ ఇంటి బయట కుటుంబ సభ్యులందరూ - ఒకరితో ఒకరైనా సరే - హిందీలోనే మాట్లాడుకుంటారు. “వాళ్ళు (గోండియేతర భాషను మాట్లాడేవారు) మమ్మల్ని ఎగతాళి చేస్తారు. లేదంటే, కొన్నిసార్లు మా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పటికీ (మేము గోండి మాట్లాడేటప్పుడు) జనాలు మమ్మల్ని ఆటపట్టిస్తుంటారు,” అన్నారాయన.
ఈమధ్య తన కుమారుడు పృథ్వీరాజ్ను రెసిడెన్షియల్ స్కూల్లో కలవడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటనను మంతరామ్ వివరించారు. “నేను తనతో గోండిలో మాట్లాడుతున్నప్పుడు, మా భాష తెలియని ఉపాధ్యాయులు, వేరే పిల్లలు మమ్మల్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. నాకు సిగ్గనిపించింది,” ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి, బడికి వెళ్ళినప్పుడు గోండిలో మాట్లాడడాన్ని అతని కొడుకు నిషేధించాడు: “నేను ఇంటికొచ్చినప్పుడు ఎంత కావాలంటే అంత గోండిలో మాట్లాడమని వాడు నాతో అన్నాడు.”
ప్రధానంగా గోండు గ్రామమైన లోనాదేయీ, ఇక్కడ నివసించే యువత తమ మాతృభాషలో మాట్లాడేందుకు ప్రోత్సహించడానికి, దానిని గర్వంగా భావించేలా చేయడానికి పెద్ద పోరాటమే చేస్తోంది. లోనాదేయీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి జిల్లాలోని పరిస్థితిని ప్రతిబింబిస్తోందని రామ్నాథ్ అభిప్రాయపడ్డారు. “ఇక్కడ, ఛింద్వాడాలో గోండులను నిమ్నకులస్తులుగా పరిగణిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో గోండిలో మాట్లాడితే, ఇతరులు తమను చిన్నచూపు చూస్తారని వాళ్ళు భయపడతారు. అందుకే, తమవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు గోండిలో మాట్లాడడానికి ఇష్టపడతారు,” ఆయన వివరించారు.
అలాగే, పాఠశాల విద్యావ్యవస్థ గోండుల పట్ల వివక్షను కొనసాగిస్తోందని, గోండి మాట్లాడేవాళ్ళ నుండి ఈ భాషను దూరం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని రామ్నాథ్ నమ్ముతున్నారు. తన గ్రామంలోని అతార్వాడ బ్లాక్లో తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలో, తన సముదాయానికి చెందిన పిల్లలు ఎలా అవమానానికి గురయ్యారో ఇప్పటికీ ఆయనకి బాగా గుర్తుంది.
ఆధిపత్య కులానికి చెందిన టీచర్, గోండు పిల్లలను ఇతర కులాల పిల్లలు, ఆదివాసీ విద్యార్థుల నుండి దూరంగా, విడిగా కూర్చోబెట్టేవాడు. అతను అంతటితో ఆగలేదు. “నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు, మా గ్రామానికి చెందిన ఇద్దరు గోండు అబ్బాయిలను శర్మ సర్ బాగా కొట్టి, దుర్భాషలాడటాన్ని నేను చూశాను. ‘మీరు గోండు కొడుకులు. నేను మీకు ఎంత నేర్పించడానికి ప్రయత్నించినా, మీరు ఎప్పటికీ ఏమీ నేర్చుకోరు,’ అని తిట్టాడు. ఆ రోజు తరువాత, ఆ అబ్బాయిలు పాఠశాలకు రావడం మానేశారు.”