“ఆమెనెవరూ ముట్టుకోవడం లేదు; అందరూ దూరం పాటిస్తున్నారు. జబ్ డాక్టర్ సాహబ్ ఆయా తో, వో భీ హాత్ మే పెహన్ కే, మూహ్ ఢక్ కే చెక్ కర్ రహా హై [డాక్టర్ వచ్చినప్పుడు, అతను కూడా పరీక్ష చేసేటప్పుడు చేతికి తొడుగులు, నోటికి మాస్కు ధరించాడు].”
సునీతా లగురికి ఆసుపత్రులు సుపరిచితమే. ఆమె తన కూతురిని, తనకి గుర్తున్న దానికంటే ఎక్కువసార్లే ఆసుపత్రులకి తీసుకెళ్ళారు.
ఆమె ఏడేళ్ళ కూతురు రియాకి ఐదు నెలల వయసులోనే తలసీమియా ఉన్నట్లు నిర్ధారణయ్యింది. తలసీమియా అనేది ఒక జన్యుపరమైన రక్త రుగ్మత. రియాకి ఉన్న ఒక రకమైన తలసీమియా కారణంగా, ఆమె జీవితాంతం క్రమం తప్పకుండా రక్తమార్పిడి చేయించుకోవడం అవసరం. అందుకే, సునీత తన కూతుర్ని నెలకి రెండుసార్లు ఆసుపత్రికి తీసుకువెళ్ళటం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో ఆవిడకి పరిచయం కూడా ఏర్పడింది.
కానీ సెప్టెంబర్ 2025లోఇలాగే ఆసుపత్రికి వెళ్ళివచ్చిన సందర్భాన్ని ఆమె ఎప్పటికీ మర్చిపోలేరు.
స్వామీ వివేకానంద నిశక్త స్వావలంబన్ ప్రోత్సాహన్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే రూ.1,000 ఆర్ధిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ఆమె ఇంటి నుండి బయలుదేరారు. అయితే, దరఖాస్తు కోసం పాపకు అదనపు పరీక్షలు చేయించమని అక్కడి సిబ్బంది ఆమెకు చెప్పారు.
పరీక్షల ఫలితాల కోసం సునీత వేచి ఉన్నారు. కానీ ఒక పరీక్షా ఫలితం వాళ్ళ జీవితాలను పూర్తిగా తలకిందులు చేసింది. ఆమె కూతురు హెచ్ఐవి-పాజిటివ్ అని తేలింది. ఆమెకు హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) సోకింది. వెంటనే చికిత్స చేయకపోతే, అది భయంకరమైన ఎయిడ్స్ (ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్) వ్యాధికి దారితీస్తుంది.
“మేమెప్పుడూ దాని గురించి వినలేదు. ఈ అనారోగ్యం ఏమిటో కూడా మాకు తెలియదు,” తన ఒంటి గది కచ్చా ఇంటి (గుడిసె) బయట రియాతో పాటు కూర్చొని ఉన్న సునీత తెలిపారు. హెచ్ఐవి గురించి తెలుసుకొని కొన్ని వారాలు గడిచినా కూడా ఆవిడ ఇంకా షాక్లోనే ఉన్నారు. తరచూ పని కోసం వలస వెళ్తుండే ఆమె భర్త విజయ్, ఈసారి తమ ఇంటిని తిరిగి కట్టుకునేందుకు తగినంత డబ్బుతో తిరిగొద్దామనే ఆశతో ఉన్నారు. ఐదుగురు సభ్యులున్న వీరి కుటుంబం, ఝార్ఖండ్లో షెడ్యూల్డ్ తెగగా వర్గీకరించబడిన హో సముదాయానికి చెందినది.















