2017లో జరిగిన నా ఛాయాచిత్ర ప్రదర్శన నేను PARIలో పనిచేయడం ప్రారంభించడానికి దారితీసింది. కానీ నన్ను దృశ్య కళాకారుడిగా పరిచయం చేసిన ఆ ప్రదర్శన వానవిల్ రేవతి, కళాకారుడైన నటరాజన్ లేకుంటే జరిగేది కాదు. 2004 సునామీ తర్వాత రేవతి నరిక్కుఱవర్ (పూసలోళ్ళు), బూమ్ బూమ్ మాట్టుకారర్ (గంగిరెద్దులవాళ్ళు) సముదాయాలకు చెందిన పిల్లల కోసం వానవిల్ పాఠశాలను ప్రారంభించారు. ఆమె ద్వారా నేను తురవిక్కాడు, ఒణ్ణంగాడు జనావాసాల పిల్లలను, ప్రజలను కలిశాను, వారి జీవితాల గురించి రాయాలని, చిత్రాలు తీయాలని తక్షణమే భావించాను.
షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన బూమ్ బూమ్ మాట్టుకారర్ తెగవారిని అదియన్లు (అథియన్లు అని కూడా పిలుస్తారు) అని కూడా పిలుస్తారు. "బూమ్ బూమ్" అనే పదాలు ఈ మాట్టుకారర్ లేదా గంగిరెద్దులనాడించే వ్యక్తి తన ఉఱుమి (ఇసుక గడియారపు ఆకారంలో ఉండే డోలు)పై చేసే శబ్దం నుండి వచ్చాయి. వారికి ఆ పేరు అలంకరించిన ఎద్దుల సహాయంతో, లేదా వాటిని ఆధారంగా చేసుకొని వారు చేపట్టిన భవిష్యవాణి వృత్తి నుండి వచ్చింది.






























