"ఇదుగో నీ బహుమతి," స్థానిక 'లబ్ధిదారు కమిటీ' సభ్యుడైన బిహారి లక్రా గుమ్లా జిల్లా, తెత్రా గ్రామ సర్పంచ్ తెరేసా లక్రాతో అన్నాడు. అలా అంటూ ఒక రూ. 5,000ను ఆమె చేతిలో కుక్కాడు. ఆ ‘బహుమతి’ 5000 రూపాయలని తెరేసాకు తెలియదు, ఆమె ఆ డబ్బును పొందనూ లేదు. ఎందుకంటే, అదే సమయంలో రాంచీ నుంచి వచ్చిన ఒక అవినీతి నిరోధక శాఖ బృందం ఆ సర్పంచ్ని సమీపించి, అవినీతి నివారణ చట్టం 1988 కింద, 'చట్టవిరుద్ధమైన లబ్ధి' ని అపేక్షించినందుకు ఆమెను అరెస్టు చేసింది.
ఈ చర్య ఉరాఁవ్ ఆదివాసీ తెగకు చెందిన 48 ఏళ్ళ తెరేసానూ, ఆమె పంచాయితీ ఉన్న బసియా బ్లాక్లోని 80,000 మందికి పైగా ప్రజలనూ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ప్రదేశానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంచీ నుంచి ఒక ఎసిబి బృందం - ఒక 5000 రూపాయల లంచం తీసుకున్నారనే కారణంతో అరెస్టు చేయడానికి - అక్కడికి రావటంలోని అసంబద్ధత గురించి ఎవరికీ ఆలోచన వచ్చినట్టు లేదు. ఒక ఎస్యువిలో అక్కడికి చేరడానికి నాకు రెండుగంటలకు పైనే పట్టింది. ఆ ఎసిబి బృందానికి ఆ ప్రదేశానికి వచ్చి పోవడానికి కనీసం 5 గంటల సమయం పట్టివుంటుంది. మిగిలిన ఖర్చులన్నీ పక్కనబెట్టినా ఆ లంచం సొమ్ములో కనీసం సగమైనా వారికి ఇందుకు ఖర్చయివుంటుంది.
అలాగే తోటి గ్రామ పంచాయతీ సభ్యులకు తెరేసాను తీసుకువెళ్ళిన ప్రదేశం - బసియా బ్లాక్ పంచాయితీ కార్యాలయం - ఆసక్తి ని కలిగించలేదు. ఆ తర్వాత వారే ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. తెరేసాను అరెస్టు చేసిన బృందం గురించి "నన్ను బసియా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళలేదు," అని ఆమె ఎత్తి చూపడం కూడా తక్కువ విచిత్రమేమీ కాదు. ఈ డ్రామా అంతా జరిగిన బ్లాక్ పంచాయతీ కార్యాలయం ఎదురుగానే కేవలం కొన్ని మీటర్ల దూరంలో పోలీస్స్టేషన్ ఉంది. అయినా, "వారు నన్ను అక్కడికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామ్దారా బ్లాక్లోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు."
ఇదంతా జరిగింది 2017 జూన్ నెలలో.
వెనక్కి తిరిగి చూసుకుంటే, 12వ తరగతి ఉత్తీర్ణురాలైన తెరేసాకు, “బసియా పోలీస్ స్టేషన్లో అందరికీ నేను తెలుసు. నేను నేరస్తురాలిని కాదని వాళ్ళందరికీ తెలుసు.” అని అర్థమయింది. ఆ తర్వాత ఆమె కేసు రాంచీలోని ప్రత్యేక కోర్టు ముందుకు వచ్చింది.






